హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఆశాజనకంగా లేదని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉన్నదని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వచ్చి కాంగ్రెస్ గెలిచింది తప్ప.. తెలంగాణలో ఆ పార్టీ బలపడలేదని అభిప్రాయపడ్డారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామని చెప్పారని, కానీ దానిపై స్పష్టత లేదని విమర్శించారు.