హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం’ వైపు మొగ్గుచూపడం అత్యవసరమని నిర్ణయించామని, టూరిస్టు బస్సుల త్రైమాసిక పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. త్రైమాసిక పన్ను హేతుబద్ధీకరణపై శుక్రవారం ఆయన రవాణా శాఖ కార్యాలయంలో టూరిస్టు బస్సు ఆపరేటర్లతో సమావేశమై అభిప్రాయాలను సేకరించారు.
ప్రస్తుతం టూరిస్టు బస్సు ఆపరేటర్లకు సింగిల్ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, టూ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అనే మూడు వేర్వేరు స్లాబుల్లో విధిస్తున్న పన్నులను సరళీకరించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఆపరేటర్లపై పన్ను భారం పెంచకుండానే ఈ మూడు స్లాబులను తొలగించి ‘ఒక రాష్ట్రం, ఒకే పన్ను’ విధానం వైపు వెళ్లడం అవసరమని భావించామని తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో అదనపు రవాణా కమిషనర్ రమేష్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.