హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీపై నెజిజన్లు మండిపడుతున్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేతల మాటలు విని నవ్వుకొంటున్నారు.
‘ఏ సీబీఐకి అప్పగించాలి? మోదీ సీబీఐకా?’ అని నిలదీస్తున్నారు. దేశంలో ప్రస్తుతం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలుసని చెప్తున్నారు. ‘కమలం నేతలు ఆపరేషన్లో ఫెయిల్ అయ్యారు. పైగా దానిని కప్పిపుచ్చుకొనేందుకు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పూ చేయకుంటే వాళ్లు ఎందుకు భయపడుతున్నారు?’ అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటే సీబీఐ చేతులు ముడుచుకొని ఉంటుందని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తుందని గుర్తుచేస్తున్నారు.