ఢిల్లీలో బీజేపీ నేతల ద్వారా ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు
1) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి.
2) పోలీసులు ఆ దుండగులను అరెస్ట్ చేస్తే.. బీజేపీ నిరసనలు.
3) రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని బండి సంజయ్ పిలుపు.
4) ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేష వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా అలజడి.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో అశాంతికి ఆజ్యం పోశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై అలజడి, ఆందోళనలు చెలరేగటంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాయంత్రం రాజాసింగ్ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం ముందుగా రిమాండ్ విధించినప్పటికీ.. తరువాత బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వవద్దంటూ రాజాసింగ్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో తమ వర్గాన్ని మునావర్ కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. కానీ, మునావర్ షో సాఫీగా జరగటంతో.. రాజాసింగ్ సోమవారం ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ 10 నిమిషాల 27 సెకండ్ల వీడియోను తయారుచేశాడు. వివాదాస్పద కామెడీ షో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి యువకులు గుంపులు గుంపులుగా దక్షిణ, పశ్చిమ, తూర్పు జోన్లలో చేరుకొన్నారు. అక్కడి నుంచి బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం దగ్గరకు చేరుకొన్నారు. రోడ్లపైనే ప్రార్థనలు చేశారు. రాజాసింగ్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. మూడు జోన్ల పరిధిలోనూ ఆందోళనలు జరిగాయి. పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. రాత్రంతా హైదరాబాద్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాజాసింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ చార్మినార్ వద్ద ఓ వర్గం యువత ర్యాలీ
రాజాసింగ్పై కేసులు నమోదు
రాజాసింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ పిర్యాదులు అందడంతో పోలీసులు మంగళ్హాట్, డబీర్పురా, బహుదూర్పురా, బాలానగర్లలో కేసులు నమోదు చేశారు. వివాదాస్పద వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగింపజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల పోలీస్ ఫోర్స్ సిబ్బంది రాత్రికి రాత్రే విధులకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కూడా మూడు జోన్ల పరిధిలో పలు చోట్ల దుకాణాలు మూసేసి రాజాసింగ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజాసింగ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం వరకు ఆందోళనలు కొనసాగాయి. పోలీసులు రాజాసింగ్ను సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు రాజాసింగ్ అనుచరులు కోర్టు ప్రాంగణానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
బెయిల్ మంజూరు
నాంపల్లి క్రిమినల్ కోర్ట్, ఆగస్ట్ 23 (నమస్తే తెలంగాణ): రాజాసింగ్ను నాంపల్లి కోర్డుకు తీసుకొచ్చి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. రాజాసింగ్కు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తరువాత రాజాసింగ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి ఇరువురి వాదనలు విన్న కోర్టు 41ఏ సీఆర్పీసీ ప్రకారం ఏడేండ్ల లోపు శిక్షలు పడే నేరాల్లో అరెస్ట్ చేసే ముందు నిందితుడికి నోటీసు ఇవ్వాలని తెలిపింది. రాజాసింగ్ కేసు విషయంలో ఇలా జరగలేదు కాబట్టి అతని అరెస్ట్ 41ఏ సీఆర్పీసీ కి విరుద్ధమని పేర్కొన్నది. రాజాసింగ్ రిమాండ్ను రిజెక్ట్ చేసి వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. రాజాసింగ్పై రాష్ట్రవ్యాప్తంగా మరో 12 కేసులు నమోదయ్యాయి.
రాజాసింగ్కు ‘అసాధారణ’ శిక్ష
జమియత్ ఉలేమా-ఎ-హింద్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రవక్త మహమ్మద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసాధారణమైన రీతిలో శిక్షించాలని ప్రముఖ ముస్లిం ధార్మిక సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ డిమాండ్ చేసింది. రాజాసింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని జమియత్ అధినేత మౌలానా మదానీ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడం, బీజేపీ సస్పెన్షన్ సకాలంలో తీసుకున్న చర్యలుగా అభివర్ణించారు. అయితే ఇది సరిపోదని, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని అసాధారణమైన రీతిలో శిక్షించాలని సూచించారు.