Raghunandan Rao | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తిపై అత్యంత హేయంగా మాట్లాడారు. టెన్త్ హిందీ పేపర్ను బయటకు తరలించిన కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేయడంతో, డీజీపీని రఘునందన్ దుర్భాషలాడారు. ‘పోలీసుల్లారా.. బీహార్ గూండా అయిన డీజీపీ అంజనీకుమార్ ఇచ్చే చట్టాలను అమలు చేయకండి. డీజీపీ అంజనీకుమార్కు ప్రత్యేకమైన సీఆర్పీసీ, ఐపీసీ ఉంటది. బీహార్లో జరిగినట్టు ఇక్కడ గూండా రాజ్యం తెస్తాం.. ప్రతిపక్షాలను కొట్టేస్తాం అంటే.. అంజనీకుమార్.. నిన్ను పంపించే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్ అని హెచ్చరిస్తున్నా’ అని బెదిరింపులకు దిగారు. రఘునందన్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు, సిబ్బందితోపాటు సామాన్య ప్రజలకు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రఘునందన్ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
డీజీపీ అంజనీకుమార్పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి.. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత దారుణమని మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రజల భద్రత కోసం రేయింబవళ్లు పని చేస్తున్న పోలీసులపై ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు నిరాశ కలిగించాయని సంఘం జాయింట్ సెక్రటరీ, డీఐజీ సుమతి ఆవేదన వ్యక్తంచేశారు. రఘునందన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. రాజకీయ ప్రయోజనాలకోసం పోలీసు వ్యవస్థ అధిపతి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.