హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుచేయలేదని, ఇప్పుడు కొత్తగా మళ్లీ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే రేవంత్రెడ్డికి రైతులమీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు.
పంటలకు బోనస్ ఇవ్వాలంటే రూ.11 వేల కోట్లకుపైగా అవసరమని, కానీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.19,756 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక బీజేపీపై బురద చల్లుతున్నదని మండిపడ్డారు. మోదీ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తావా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ చేశారు.