హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నదని ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నదని అన్నారు.
ఇక ఢిల్లీలో సోమవారం బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయదని, రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీయింబర్స్మెంట్ చేస్తుందని.. ఇదే ప్రొసీజర్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలు రైతులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో చెబుతున్నాయి.