బీజేపీ నేతలకు నిధులు తెచ్చే దమ్ముందా.. రాష్ర్టానికిచ్చిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించండి
కిషన్రెడ్డి, బండి సంజయ్ గుజరాత్ గులాములు.. రాహుల్కి ఎడ్లు తెల్వది.. వడ్లు తెల్వది
మెట్పల్లిలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. కోరుట్లలో ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరం
సిరిసిల్ల జిల్లా మల్కపేటలో చల్మెడ ట్రస్టు నిధులతో నిర్మించిన స్కూలు భవనానికి ప్రారంభం
జగిత్యాల/సిరిసిల్ల జూన్ 10, (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదలచేయాలని సవాల్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డి గులాములని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి పబ్బులు, క్లబ్బులు తప్ప ఎడ్లు, వడ్ల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు మూతిమీద తన్నేలా సమాధానాలు చెప్పాలని, ప్రతి కార్యకర్త తన పరిధిలో కథానాయకుడై ప్రగతిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్ష
టీఆర్ఎస్ ఎంత బలపడితే తెలంగాణకు అంత లాభం చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంపై సీఎం కేసీఆర్కు ఉన్నంత ప్రేమ ఇంకెవరికీ లేదని పేర్కొన్నారు. దేశంలో రోజులో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక మొగోడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీది కర్షక్ యోజన కాదని, కార్పొరేట్ యోజన అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు సైతం రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు సర్కార్ దవాఖానాలో వైద్యం అంటే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు సర్కార్ దవాఖానాల్లోనే ఎక్కువమంది వైద్యం చేయించుకొంటున్నారని చెప్పారు.
రాహుల్గాంధీకి సిగ్గుందా?
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల్కు వచ్చి ఒక్కచాన్స్ ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ముత్తాత నుంచి తల్లి వరకు దేశాన్ని పాలించారని, యాభై ఏండ్లపాటు వారి పాలనే సాగిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. రైతులను మళ్లీ పిచ్చోళ్లను చేసేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్గాంధీకి సిగ్గులేదని ధ్వజమెత్తారు. ‘రాహుల్కు ఎడ్లు తెలుసా? ఎవుసం తెలుసా? ఆయనకు తెలిసింది పబ్లు.. క్లబ్లు.. చిందులు మాత్రమే. బీజేపీ నేత బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. మసీదులు తవ్వుదాం.. శవం వస్తే మీది. శివం వస్తే మాది అని సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలకు మోదీ ఏం మంచి చేస్తున్నాడో గుండు చెప్పడు, అరగుండు చెప్పడు. కానీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. వారిని జంతువులతో కూడా పోల్చలేం’ అని ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై బాండ్ పేపరు రాసిచ్చి మాట తప్పిన గుండుకు ఇజ్జత్, మానం ఉన్నదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి, గుండు అందరూ గుజరాత్ గులాములేనని ఎద్దేవా చేశారు. జూలైలో రాష్ర్టానికి వస్తున్నామంటున్న బీజేపీ ప్రతినిధులు, రైతాంగానికి లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని డిమాండ్చేశారు.
రూ.2 కోట్లతో చల్మెడ ట్రస్ట్ స్కూల్ నిర్మాణం
సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మల్కపేట గ్రామంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకీదేవి ట్రస్టు రూ.2 కోట్లతో సకల వసతులతో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. వేములవాడలో రూ.3 కోట్లతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని, రూ.3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.
కోరుట్లలో ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరం
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల సంజయ్ ఉద్యోగార్థుల కోసం ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను మంతి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 ఏండ్లలో రాష్ట్ర ప్రభుత్వం 1.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇప్పుడు మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత ఏకాగ్రతతో కృషిచేయాలని సూచించారు. గతంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థికి ఒకేసారి 8 రకాల ఉద్యోగాలు వచ్చాయని, ప్రతి ఒక్కరూ అలా ప్రిపేర్ కావాలని చెప్పారు.
మోదీ ఇప్పుడెవరు దిగిపోవాలి?
బీజేపీ పాలనలో దేశం నాశనమవుతున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘45 ఏండ్లలో ఏన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. 35 ఏండ్ల గరిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగింది. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను పాలన చేతకాకపోతే దిగిపోవాలని అప్పడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ సవాల్ చేశారు. ఇప్పుడు సిలిండర్ రూ.1050 అయింది. ఇప్పుడు ఎవరు దిగిపోవాలో ప్రజలు చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు. మతంపేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నేతలకు దేవుళ్లపై భక్తి ఉంటే రాష్ట్రంలోని అలయాల అభివృద్ధికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి నర్సన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.500 కోట్ల చొప్పున కేంద్రం నుంచి తీసుకురావాలని బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎం సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్బాబు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు ఉన్నారు.