బీజేపీ నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవు
వర్ని, సెప్టెంబర్ 5: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపు, హుమ్నాపూర్, రాజ్పేట్, శంకోరా గ్రామాల్లో పలు కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నా కొంతమంది రాజకీయ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో హూందాతనం ఉండాలని, నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షల మంది లబ్ధిపొందినట్టు తెలిపారు.