యాత్ర కొన సాగుతుండగా చేరికలు
మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో 300 మంది నేతల చేరిక
మహబూబ్నగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నేతల ఒంటెత్తు పోకడలపై కమలం నాయకులు కన్నెర్ర జేశారు. ఇక మీతో వేగలేమని గులాబీ గూటికి క్యూ కట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం టీఆర్ఎస్లో చేరుతున్నారు. రెండు రోజుల కిందట భూత్పూర్ మండలం కొత్త మొల్గర ఎంపీటీసీ సభావత్ రమణిమేఘనాథ్సహా 50 మంది కమలం నేతలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో కారెక్కారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి సత్యంయాదవ్, కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు జీ పెద్ద రాములు నేతృత్వంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది బీజేపీ ముఖ్యకార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
గత నెల 14న అలంపూర్ నుంచి ప్రారంభించిన బండి పాదయాత్రకు జనం నుంచి స్పందన రావడం లేదు. గద్వాల, మక్తల్ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఫ్లెక్సీలు, ప్రకటనల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటో మాత్రమే వేసి మిగతా ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ ఫొటోలు వేయకపోవడంపై ఆ పార్టీలోనే చర్చ మొదలైంది. ఒంటెత్తు పోకడలతో బండి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని కమలం నేతలు చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా అధికార టీఆర్ఎస్లో చేరుతున్నారు. భవిష్యత్తులో బీజేపీ నుంచి మరిన్నీ వలసలు తప్పేలాలేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
హైదరాబాద్లోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి సత్యం యాదవ్, కోయిల్కొండ మండలం రాంపూర్ గ్రామ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు పెద్ద రాములుతోపాటు 300మంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 50 మంది యువకులు అన్నాసాగర్లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జడ్చర్ల మండలంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్రలు చేస్తుంటే జనాలు లేకపోవడం అటుంచి, పార్టీలో సమన్వయ లోపం వల్ల టీఆర్ఎస్లోకి వలసలు పెరగడం గమనార్హం.