సూర్యాపేట, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకరు గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండు రాసిస్తడు. మరొకరు ఢిల్లీలో మోదీని ఒప్పిచ్చి బీభత్సంగా నిధులు తెచ్చి.. ఊర్ని బాగుచేస్తమంటరు. ఇదిగో ఇప్పుడు వచ్చిండండీ.. మరోసామి.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతడట. ఏదన్నచేసి మోదీ కాడ కూచొని మునుగోడులో మాత్రం వృద్ధాప్య పింఛను పెంచిపిస్తడంట. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఇస్తున్న ఈ హామీని విని పింఛన్లు పొందుతున్న అవ్వఅయ్యలే నవ్వుతున్నరు. యువకులైతే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారుకు కారు.. బైకుకు బైకు.. ఇంటికి ఇల్లు.. అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీలను రిథమిక్గా మాట్లాడుతూ ఎద్దేవా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న పింఛనే రూ.200.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛను రెండువేలు. రెండింటికీ ఏమాత్రం పొంతనలేదు. 200 ఇయ్యడానికే ఆపసోపాలు పడే మోదీ.. ఈ రాజగోపాల్ వెళ్లి ఆయన దగ్గర కూచోంగనే.. ఏకంగా మూడు వేలు ఇచ్చేస్తడంట. చెప్పేటోనికి వినేటోడు లోకువ అంటే ఇదేనేమో..
జుమ్లాలు చెప్పడంలో వారికి వారే పోటీ..
జనం కోసం రాజీనామా అంటాడు.. కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలోకి ఎందుకు చేరాడో చెప్పడు.. తాను సొంత నిధులతో అభివృద్ధి చేస్తానన్న హామీలను గాలికి వదిలేశాడు. రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత బీజేపీలో చేరానని మీడియా ముచ్చట్లలో ఒప్పుకుంటడు. తీరా! ఇయ్యాల ఎన్నికల ప్రచారంలో ‘మీ కోసమే రాజీనామా చేశాన’ని ప్రజలకు చెప్తున్నడు. గతంలో మునుగోడులో తన సొంత డబ్బుతో ప్రతి మండలానికి కాలేజీ, స్కూల్ ఏర్పాటు చేయిస్తానని, అందరికీ ఉచిత విద్య అందిస్తానని, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇస్తానని హామీలిచ్చి.. గెలిచినంక పారిపోయిన రాజగోపాల్.. ఇప్పుడు మళ్లీ హామీల మూట విప్పుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నరు.
మునుగోడులో రూ.3 వేలట!
తప్పులు చేసేవారు ఉప్పు తిన్నా, నాలుక ఊరకే ఉంటదా? అన్నట్టు రాజగోపాల్రెడ్డి మునుగోడులో వృద్ధులకు రూ.3 వేల పింఛన్ ఇస్తనని ఊరూరా హామీలిస్తున్నడు. కానీ జనం చైతన్యం ఉన్నవారు.. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటూ మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వృద్ధాప్య పింఛన్ రూ.200 నుంచి రూ.500 వరకే ఉన్నది. అక్కడ పెంచని మోదీ, మునుగోడులో ఎలా పెంచుతారబ్బా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అత్యంత మానవీయంగా ఆలోచన చేశారు కాబట్టే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 వేలు, రూ.3 వేల పింఛన్ ఇస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న లబ్ధిదారులు కేసీఆర్ వెంటే నడుస్తామని బహిరంగంగానే చెప్తున్నారు.