Etamatam | టికెట్ కావాలని పైరవీలు చేసేవారిని చూశాం కానీ, టికెట్ వద్దని లాబీయింగ్ చేసే వారిని మాత్రం తెలంగాణ బీజేపీలోనే చూస్తున్నాం. టికెట్ ఇచ్చి మా రాజకీయ జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ సీనియర్లు పార్టీ పెద్దలను వేడుకుంటున్నారు. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన జాబితాలో ఉన్న నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల వరకు వదిలేయండి అని ప్రాధేయపడుతున్నారు. గద్వాల టికెట్ తనకు ఇవ్వడం కంటే బీసీలకు ఇస్తే, బాగుంటుందని దొడ్డ మనసును చాటుకున్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
‘ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా రివర్షన్ ఎందుకు? కాదూ కూడదూ అంటే.. షాద్నగర్ నుంచి మా అబ్బాయికి ఇవ్వండి’ అని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి అంటున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని డిమాండ్లున్నా, అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన తనకు లేదని విజయశాంతి ముందే తప్పించుకున్నారు. టికెట్ వద్దని ఇక్కడ కూర్చొని చెబితే పప్పులేమీ ఉడకవు. మమ్మల్ని చూడండి… మా పేర్లు కనీసం పరిశీలనకు కూడా రాకుండా ఎంతగా ముందు జాగ్రత్త పడ్డామో… అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వెక్కిరిస్తున్నారు. మీరు బాగానే ఉన్నారు… మేము మాత్రమే బలి పశువులం కావాలా? అని బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు గుస్సా మీద ఉన్నారట.