విభజన సమస్యలు పరిషారమవుతాయన్న ఆశతో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరితే.. రెండేండ్ల నుంచి ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైంది. ఆ పార్టీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క కేసీఆర్ మాత్రమే. ఆయన నాయకత్వంలో ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తా.
– కే స్వామిగౌడ్
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలో చేరిన. అక్కడ మూస రాజకీయాలతో విసిగిపోయిన. ఆ పార్టీలో దశ దిశలేని రాజకీయాలు జరుగుతున్నయి. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించేది పోయి.. మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచి గెలవాలనుకుంటున్నరు. తుదిశ్వాస వరకు కేసీఆర్తోనే ఉంటా, నాకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తా.
– దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక ముంగిట బీజేపీకి మరో పెద్దషాక్ తగిలింది. రెండ్రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడగా, శుక్రవారం ఇద్దరు కీలక నేతలు కే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్కుమార్లు బీజేపీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన కార్యక్రమంలో వారిద్దరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నేత కేసీఆర్ మాత్రమే. ఆయన నాయకత్వంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం కోసం స్వామిగౌడ్ వీరోచిత పోరాటాలు చేశారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడం శుభపరిణామం. ఉద్యమకాలంలో పనిచేసిన వాళ్లు పార్టీని వీడిపోయినపుడు కొంత బాధ కలిగింది. అయినా ఎక్కడ కనిపించినా మాట్లాడుకొన్నాం. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉన్నది’ అన్నారు.
సొంతింటికి వచ్చిన సంతోషం
బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉన్నదని శాసనమండలి మాజీ చైర్మన్ కే స్వామిగౌడ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరితో కలిసి తెలంగాణ సాధనకు పోరాడామని, విభజన సమస్యలు పరిషారమవుతాయన్న ఆశతో బీజేపీలో చేరితే.. రెండేండ్ల నుంచి ఏ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించలేకపోయిన బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు.
– స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
కడదాకా కేసీఆర్తోనే..
అనాలోచితంగానో టీఆర్ఎస్ను వీడి వెళ్లిన తనను మళ్లీ ఒక సభ్యుడిగా పార్టీలోకి ఆహ్వానించారని దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. ఇన్నేండ్లకు మళ్లీ సొంత ఇంటికి రావడం ఆనందంగా ఉన్నదన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లానని, అక్కడ మూస రాజకీయాలతో విసిగిపోయానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుల్లో పనిచేశానని, దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్లో కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు కేసీఆర్తోనే ఉంటానని, తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో నెరవేరుస్తానని స్పష్టం చేశారు.
– దాసోజు శ్రవణ్కుమార్