హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేయగా.. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయాన్నే రంగంలోకి దింపారు. పీఎంవో కార్యదర్శి, ఇటీవల కేంద్ర జలసంఘం డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ఏయే అంశాలపై దృష్టి సారించాలో సూచించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీడబ్ల్యూసీ అధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్పై రిమార్క్లను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 160 టీఎంసీలు ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తదతనంతరం మారిన పర్యావరణ పరిస్థితులు, వరద ప్రవాహాలకు అనుగుణంగా, కేటాయించిన నదీజలాలను నిర్ణీత రోజుల కంటే తక్కువ సమయంలోనే ఎత్తిపోసేలా ప్రణాళిక మార్చింది. అందుకోసం ప్రాజెక్టు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచింది. అయితే ఈ అదనపు టీఎంసీని కూడా ప్రత్యేక ప్రాజెక్టుగా కేంద్రం పరిగణిస్తూ వస్తుండటమే కాకుండా, అందుకు ప్రత్యేక డీపీఆర్ను సమర్పించాలని పట్టుబడుతున్నది.
అక్కడితో ఆగకుండా ఇటీవల విడుదలచేసిన రివర్ బోర్డు గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరాన్ని చేర్చింది. కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దీనికి పలు అనుమతులు వచ్చాయని సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రకటించారు. స్వయంగా కేంద్ర జల్శక్తి మంత్రికి కూడా విన్నవించారు. అయినా కేంద్రం ససేమిరా అనటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీకి సంబంధించిన డీపీఆర్ను సీడబ్ల్యూసీకి అందజేసింది. దానిపై సీడబ్ల్యూసీ అధికారులు లేవనెత్తిన అన్ని సందేహాలకు రాష్ట్ర ఇంజినీరింగ్ అధికారులు సహేతుకంగా, సవివరమైన సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. ఇక ఇట్లా కాదని నేరుగా ప్రధాని కార్యాలయమే రంగంలోకి దిగి ఏకంగా గతంలో ఇచ్చిన అనుమతులనే పునఃపరిశీలించాలని సీడబ్ల్యూసీని ఆదేశించిందని నాటి సమావేశానికి హాజరైన పలువురు అధికారులే అభిప్రాయపడ్డారు.
నాడు పెంచమని.. నేడు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ రాసిన లేఖలో లేవనెత్తిన ప్రశ్నలు అసంబద్ధంగా ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ నాడు కీలక అభిప్రాయాలు తెలిపింది. 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ప్రతిపాదించిన ప్రాజె క్టు నీటినిల్వ సామర్థ్యం కేవలం 14 టీఎంసీలే ఉండటాన్ని తప్పుబట్టింది. ప్రాజెక్టులో రిజర్వాయర్ల కెపాసిటీని పెంచాలని, అది కూడా కృత్రిమ రిజర్వాయర్లను నిర్మించాలని స్వయంగా సూచించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. సీడబ్ల్యూసీ సూచన మేరకు ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 147 టీఎంసీలకు పెంచింది.
ముంపు లేకుండా ఉండేలా గోదావరిపై బరాజ్లు నిర్మించింది. అక్కడి నుంచి ఎత్తిపోసే నీటిని నిల్వచేసి పంటపొలాలకు తరలించేందుకు 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్తోపాటు మరికొన్ని చోట్ల రిజర్వాయర్లను నిర్మించింది. అయితే నాడు సామర్థ్యం పెంచుకోవాలని సూచించిన సీడబ్ల్యూసీనే వాటిని ఎందుకు నిర్మించారని శనివారం నాటి లేఖలో ప్రశ్నించటం గమనార్హం. తెలంగాణ ప్రత్యేక భౌగోళిక నిర్మాణం దృష్ట్యా ఎత్తిపోతల పథకాలే శరణ్యం. అలా కాకుండా నదిలోనే భారీ ఆనకట్ట కడితే తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో భారీగా ముంపు ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు చిన్న మొత్తంలో నీరు నిల్వ ఉండి, ఎత్తపోతలకు అనుకూలంగా ఉండేలా బరాజ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి నీటిని ఎత్తయిన ప్రదేశానికి తరలించి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించేలా ఏర్పాటుచేశారు. అందుకోసమే నదిలేని చోట కృత్రిమ రిజర్వాయర్లు నిర్మించటం అనివార్యమైంది.