వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం
దీటైన ప్రత్యర్థి గులాబీ పార్టీయేనని నమ్మిక
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ బీజేపీకి దీటుగా ఎదురు నిలబడే పార్టీ కోసం ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ను బీజేపీని ఢీకొట్టగల సిసలైన ప్రత్యర్థిగా వారు భావిస్తున్నారు. మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతుండటం, బీజేపీ రాజ్యాంగ విరుద్ధ చర్యలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటుండటంతో దేశవ్యాప్తంగా గులాబీ పార్టీపై ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ చతికిలబడటం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయనుకున్న పార్టీలన్నీ మౌనంగా ఉండటంతో బీజేపీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ విశ్లేషకులు, అధికారులు, వివిధ వర్గాల ప్రతినిధులు కొంతకాలంగా దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని టీఆర్ఎస్ బలంగా వ్యతిరేకిస్తుండటం, సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు తెలంగాణకు వరుసకట్టడంతో వారికి ఓ స్పష్టత వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రతినిధులు టీఆర్ఎస్తో టచ్లోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా సేకరించిన సమాచారాన్ని వారు టీఆర్ఎస్ నేతలతో పంచుకుంటున్నారని సమాచారం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నేతలు సాగించిన అక్రమాల వివరాలు ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ దగ్గరికి చేరుతున్నట్టు తెలిసింది. బీజేపీ బాధితులు సైతం టీఆర్ఎస్ శ్రేణులను ఆశ్రయిస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల బడాబాబులు పొందిన లబ్ధి వంటి కీలక పత్రాలన్నీ టీఆర్ఎస్ నేతలతో పంచుకుంటున్నారు. మొత్తంగా బీజేపీ గుట్టు టీఆర్ఎస్కు చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.