సిద్దిపేట, ఆగస్టు 19: బీజేపీ నేతలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేక పూటకోమాట మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్దిపేటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పైసా రామకృష్ణ తన అనుచరులు 100 మందితో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రెండు జాతీయ పార్టీలు నాటి నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు.
నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నేడు స్వరాష్ట్రంలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యా యం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు తలా ఓ మాట మాట్లాడుతున్నారని.. ‘కాళేశ్వరం ప్రా జెక్టు గొప్పదని పలువురు కేంద్ర మంత్రులు పొగిడా రు.. నేడు మరో కేంద్ర మంత్రి షెకావత్ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాడు.. పూటకో మాట.. తలా ఓ మాట మాట్లాడుతూ అబద్ధాలకు కేరాఫ్గా నిలుస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్సేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి , సంక్షేమంలో తెలంగాణ ఒక స్వర్ణయుగమని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే, నేను మంత్రిగా లేకుంటే.. సిద్దిపేట జిల్లా అయ్యేదా?, సిద్దిపేటకు తాగు, సాగునీరు వచ్చేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై బీజేపీ, కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు.