హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘చేనేతపై రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీని (ఎస్జీఎస్టీ) తగ్గించుకోవచ్చు కదా?’ అని ఉచిత సలహా ఇచ్చారు. జీఎస్టీ మూల నినాదమే ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్’. దేశమంతటా సమానమైన పన్నులు ఉండాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. జీఎస్టీలో మార్పులు, చేర్పుల అధికారం జీఎస్టీ కౌన్సిల్కే ఉంటుంది. రాష్ర్టాలు తమ వాటా తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా జీఎస్టీ కౌన్సిల్లో 3/4 వంతు మెజారిటీ పొందాలి. ఇది అసాధ్యం. ఇప్పటివరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా జీఎస్టీలో మార్పు చేయలేదు. జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ర్టానికి ఉన్నదా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ అవగాహన బండి సంజయ్కి, కిషన్రెడ్డికి లేకపోవడం ఆశ్చర్యకరం. కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాష్ర్టాల పన్నుల విధానం, జీఎస్టీ గురించి తెలుసుకోకపోవడం బాధ్యతారాహిత్యమే.
కిషన్రెడ్డివి అడ్డగోలు మాటలు
వివిధ పార్టీల శాసనసభా పక్షాలు టీఆర్ఎస్లో విలీనమైన అంశంపై కూడా కేంద్ర మంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. రాజ్యసభలో టీడీపీకి చెందిన ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్రావు, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరడానికి, రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ చైర్మన్ ఏ నిబంధన కింద అనుమతించారో కిషన్రెడ్డికి తెలియదా? ఇటీవల గోవాలో, సికింలో కూడా ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొన్నారు. బీజేపీ చేస్తే ఒప్పు అయినప్పుడు.. తెలంగాణలో జరిగితే తప్పు ఎలా అవుతుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన తర్వాత కూడా నీతి, నిజాయితీ గురించి కిషన్రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు.