హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నది. ఇదిలా ఉండగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జిట్టా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతోపాటు తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అనేకసార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, పార్టీ నుంచి వెళ్లిపోతామని బెదిరిస్తున్న వారికి నామమాత్రపు పదవులు ఇస్తూ బుజ్జగిస్తున్నారని ఆరోపిస్తూ వచ్చారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి సృష్టించి, ఈటల రాజేందర్కు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ పదవి విధివిధానాలేమిటో నిర్ణయమే కాలేదని మండిపడ్డారు. తన అసంతృప్తిని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎన్నోసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాలతో తాను పార్టీలో కొనసాగలేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నది.