BJP Leader Etala | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పదే పదే ప్రచారం చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడి అయినా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడ్డగోలుగా హామీలు గుప్పించారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయగలమో లేదో అనే సోయి కూడా లేకుండా డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో ఉచిత పథకాలు పొందుపరిచారని ఈటల మండిపడ్డారు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేక హామీలు ఇచ్చారా? లేదా.. అవగాహన ఉండి కూడా ప్రజలను వంచించడానికి హామీ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.
అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని, రైతుబంధు పెట్టుబడి సాయం రూ.15 వేలకు పెంచుతామని, కౌలు రైతులకూ అందిస్తామని చెప్పారని, ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామన్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డట్టే మహిళలకు ప్రతి నెల ఒకటో తేదీన రూ.2500 ఖాతాలో వేస్తామన్నారని, పెన్షన్ రూ.4వేలకు పెంచుతామన్నరని.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. మాట మార్చడం సీఎం రేవంత్ రెడ్డికి కొత్తేం కాదన్నారు.
ఆయన ఇటీవల ప్రధాని మోదీ తమ పెద్దన్న అని చెప్పారని, ఇప్పుడు మాట మార్చి మోదీకి ఎందుకు ఓటెయ్యాలె అని ప్రశ్నిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో స్తలం సరిపోవడం లేదన్నారు. కొత్త బస్సులు ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలాకాలం తర్వాత ప్రజలు నీళ్లకోసం పరితపించి, పంటలు ఎండిపోయి, పొలాలను పశువులకు వదిలే పరిస్థితి వచ్చిందని, దీనికి ఎవరు కారణమో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరితే.. కాంగ్రెస్లో అన్ని పదవులు అనుభవించి, చివరిదశలో ఇప్పడు పార్టీ మారారంటూ సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు కేశవరావును, కడియం శ్రీహరిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. తనను కాంగ్రెస్లో అవమానిస్తున్నారంటూ కేశవరావు బీఆర్ఎస్లో చేరారన్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవి, ఎంపీ సీట్తోపాటు ఆయన కుమారుడికి కూడా పదవి ఇచ్చారని, బిడ్డను హైదరాబాద్ మేయర్ను చేశారని గుర్తు చేశారు. ఇలా గౌరవం, పదవులు పొందిన వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలన్నారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారని, ఎమ్మెల్సీని కూడా చేశారని, ఆయన కూతురుకు వరంగల్ టిక్కెట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో కడియం శ్రీహరి దళితుడే కాదని ప్రెస్మీట్ పెట్టి మరీ విమర్శించి, ఇప్పుడు ఆయన కూతురుకు టిక్కెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఎలా టిక్కెట్ ఇస్తారన్నారు. పార్టీ మారిన వారు పదవికి రాజీనామా చేయకపోతే వేటు పడేలా చట్టం చేస్తామని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, దీనిని ముందు తెలంగాణలో అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బులు పెట్టి నేతలను కొంటున్నారని, బిల్లులు కావాలంటే తమ పార్టీలో చేరాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.