DK Aruna | రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు..మిస్టర్ రేవంత్రెడ్డి ఆన్సర్మీ అంటూ బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేల ఆర్థిక సాయం, అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేటలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని డీకే అరుణ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడి ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలేలా చర్యలు తీసుకొని తెలంగాణలో ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న ధ్యాస లేదని కన్నెర్ర చేశారు. విపత్కర పరిస్థితులలో రైతులను ఎలా ఆదుకోవాలన్న సోయే ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. రైతులకు లేనిపోని ఆశలు చూపి వారి అడియాశలు చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.