మహబూబ్నగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సవా ల్ విసిరారు. శనివారం మహబూబ్నగర్లో మీడియాతో ఆమె సీఎం రేవంత్పై ఘాటుగా స్పందించారు.
ఒక ఆడదాన్ని అని కూడా చూడకుండా ఆరోపణలు చేస్తావా? అంటూ కడిగిపారేశారు. ‘మమ్మల్ని పండబెట్టి తొక్కుతాడంట.. నన్ను పండబెట్టి తొక్కి.. ఆయన పార్లమెంటుకు గెలిపించుకుంటాడంట వాళ్ల అభ్యర్థిని.. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు ఇవేనా? ఎలా తొక్కుతావో రా.. సూసుకుందాం రా.. అంటూ సవాల్ విసిరారు. ‘ఒక మహిళ అని చూడకుండా నోటికొచ్చినట్టు దొరసాని.. తొక్కుతా.. అంటూ అహంకార మాటలు మానుకోవాలి. నీ తల్లి, చెల్లి, నీ కూతురిని అడుగు మహిళ అంటే ఏమిటో చెబుతారు’ అని మండిపడ్డారు.