BJP Chakradhar Goud | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేల మంది అమాయకులను మోసగించి భారీగా డబ్బు దండుకున్న సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత మూడేండ్లలో ఆయన దాదాపు 22 వేల మందిని మోసగించి రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ డబ్బుతో పలు ఆస్తులను కూడబెట్టుకుని సమాజ సేవకుడిగా చలామణి అవుతుండటంతో ప్రజలతోపాటు పోలీసులు సైతం విస్తుపోతున్నారు. గతంలో బ్యాంక్ ఏజెంట్గా పనిచేసిన చక్రధర్గౌడ్.. కొంత కాలంపాటు తన బావమరిదితో కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కొనసాగాడు. ఆ తర్వాత తన బంధువు వినోద్తో కలిసి 2018లోనే డాటా ఎంట్రీ ఉద్యోగాల దందాకు స్కెచ్ వేశాడు. తొలుత హైదరాబాద్లోని అమీర్పేటలో కాల్సెంటర్ను ఏర్పాటు చేసి మోసాలకు తెర లేపాడు. కరోనా సంక్షోభ సమయంలో ఆ కాల్సెంటర్ను తాత్కాలికంగా మూసివేసిన చక్రధర్గౌడ్.. ఆ తర్వాత తన అడ్డాను పంజాగుట్టకు మార్చి,అక్కడ పెద్ద భవనాన్ని కిరాయికి తీసుకున్నాడు.
అమెరికాలో ఉంటున్న ఆ భవన యజమానికి నెలకు రూ. 1.3 లక్షల అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. బ్యాచ్లవారీగా టోకరా వివిధ రాష్ర్టాలకు చెందిన టెలికాలర్స్ ద్వారా దక్షిణాది రాష్ర్టాల్లోని అమాయకులకు ఫోన్లు చేసి డాటా ఎంట్రీ ప్రాజెక్టులు ఇస్తామంటూ నమ్మించడమే పనిగా పెట్టుకున్న చక్రధర్గౌడ్.. ఒక్కో ప్రాజెక్టుతో నెలకు సులభంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలు సంపాదించుకోవచ్చంటూ వల వేశాడు. ఆ వలలో చిక్కినవారికి ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఫొటోలను పంపి వాటిని డాక్యుమెంట్లుగా కన్వర్ట్ చేయాలని టార్గెట్ ఇచ్చాడు. ఆ పని పూర్తిచేసినవారికి బిల్లులు చెల్లించేందుకు వారి నుంచే సొమ్ము గుంజాడు. అడ్వాన్స్గా 10%, పొరపాట్లను సవరించేందుకు మరో 10% చొప్పున మొత్తం 20% (ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి 5 వేల వరకు) వసూలు చేశాడు. ఇలా ఒక్కో బ్యాచ్లో దాదాపు 2 వేల మందిని మోసగించి ఆ బ్యాచ్ను క్లోజ్ చేశాడు. ఆ బ్యాచ్కు ఇచ్చిన డాటా ఎంట్రీ ఇమేజ్లను, వారి కోసం వాడిన సిమ్కార్డులను ధ్వంసం చేసి కొన్నాళ్ల విరామం తర్వాత మరో బ్యాచ్ను ప్రారంభించాడు. ఇలా 2021 నుంచి 11 బ్యాచ్లలో దాదాపు 22 వేల మందిని మోసగించి రూ.10 కోట్ల వరకు వసూలు చేశాడు. ఆ డబ్బుతో బాచుపల్లి ప్రాంతంలో 4 ప్లాట్లతోపాటు 5 లగ్జరీ కార్లు కొనుగోలు చేశాడు. అయినా తాము నష్టపోయింది చిన్న మొత్తమే కదా అని బాధితులు వదిలేయడంతో ఇప్పటివరకు చక్రధర్గౌడ్ దందా నిరాటంకంగా కొనసాగింది. కానీ, ఇటీవల ఇద్దరు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో చక్రధర్గౌడ్ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో త్వరలో ఆయనను కస్టడీలోకి తీసుకుని అతని గతచరిత్రను, బ్యాంకు ఖాతాలను విశ్లేషించనున్నామని, తద్వారా మరిన్ని నేరాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు చెప్తున్నారు.
చక్రధర్గౌడ్ నేరాల చిట్టా ఇదీ..