జగిత్యాల, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులతో దొంగాటకు దిగాడు. సున్నితమైన ప్రదేశంలో, భావోద్వేగాలు పెరిగిపోయి, అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నదని, ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దని, ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని భైంసా పోలీసులు స్పష్టం చేశారు. అయినా కూడా కావాలనే శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే ఉద్దేశంతో సంగ్రామ యాత్రకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా మోహన్రావుపేట వద్ద అదుపులోకి తీసుకొన్నారు.
వాహనాలు మారుస్తూ.. పోలీసులను ఏమారుస్తూ
ఎవరికీ అనుమానం రాకుండా కరీంనగర్ నుంచి వాహనంలో బండి సంజయ్ బయల్దేరారు. విషయం తెలిసిన పోలీసులు గంగాధర వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. అయితే వాహనాన్ని మార్చి.. పోలీసులను ఏమార్చి జగిత్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఉన్నారు. ఆయన తాటిపెల్లికి చేరుకున్న విషయం తెలుసుకున్న జగిత్యాల పోలీసులు గ్రామ శివారులో బారికేడ్లు ఏర్పాటు చేసి బండిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, మరోసారి తన వాహనాన్ని మార్చి మరో వాహనంలో నిజామాబాద్ వైపు బయల్దేరారు. ఆయన తాటిపెల్లి నుంచి వెళ్లిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. కోరుట్ల శివారులో ఉన్న మోహన్రావుపేట గ్రామ పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మోహన్రావుపేట వద్ద బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు ఆయనకు పరిస్థితిని వివరించారు. భైంసా ప్రాంతం సున్నితమైందని, అక్కడ పాదయాత్రలకు, బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అనుమతి లేని చోట పాదయాత్ర నిర్వహించొద్దని, పోలీసులకు సహకరించి, కరీంనగర్కు తిరిగి వెళ్లిపోవాలని కోరారు. దీనికి కొంత సేపు బండి ససేమిరా అనడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో కొందరు బండి సంజయ్ అనుచరులు మోహన్రావుపేట వద్దకు చేరుకొని అరుపులు, నినాదాలతో ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారు.
కరీంనగర్కు తరలింపు
చివరకు జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బండి సంజయ్ను ఆయన వాహనంలోనే కరీంనగర్కు తరలించారు. కాగా, సంజయ్ ఇంటి వద్ద ఎప్పటిలాగే ఒక పోలీస్ పార్టీ భద్రతా విధుల్లో ఉందని కరీంనగర్ ఇన్చార్జి టౌన్ ఏసీపీ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుమించి ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని, సోమవారం కోర్టు నుంచి ఏదైనా అనుమతి వస్తే దాని ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు.
కావాలనే మంకుపట్టు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. డిసెంబర్ 6వ తేదీ నేపథ్యంలో సున్నితమైన భైంసాలో పాదయాత్రలు, బహిరంగ సభల వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయని భావించి పోలీసులు బండి యాత్రకు, బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. భైంసా పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని ఆదివారం ప్రకటన జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకులకు కూడా తెలిపారు. పరిస్థితిని ముందే వివరించి, అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసినప్పటికీ వినిపించుకోని బండి.. భైంసా వెళ్లేందుకు యత్నించారు.