సుబేదారి, నవంబర్ 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర మూడో మహా సభలు హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు.
శుక్రవారం జరిగిన సభలో హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, ప్రశ్నించే మేధావి వర్గాన్ని జైల్లో పెట్టి నిర్బంధిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సంస్కృతి, కార్పొరేట్, మీడియాను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామిక వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.