కాగజ్నగర్, ఫిబ్రవరి 26 : బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ సర్కారు గత ఎనిమిదేండ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను మారుస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగితెప్పిస్తానని చెప్పి మాట తప్పిన మోదీ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని విమర్శించారు. దేశంలో మత కలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైందని అన్నారు.