వరంగల్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ సైనికుడిలా మీ ముందుకు వస్తున్నా.. అందరి సమస్యలను పరిష్కరిస్తా.. మొదటి ప్రాధాన్య ఓటు వేసి ఆశీర్వదించాలని నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేధావులు, పట్టభద్రులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో అపోహలు ఉండేవని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తర్వాత అన్ని వర్గాల వారు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు, ప్రభుత్వం ఒకే కుటుంబ సభ్యులని.. ఆ భావన ఎల్లప్పుడు కొనసాగాలని ఆకాంక్షించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేలా కొందరు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనకు అవకాశం ఇస్తే అందరి సమస్యలను పరిష్కరిస్తానని పల్లా హామీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన అభివృద్ధిని విశ్లేషించుకుని పట్టభద్రులు ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎం టీజీవోలతోనే చర్చిస్తారని చె ప్పారు. ప్రభుత్వంలో గెజిటెడ్ ఉద్యోగులది పెద్దన్న పాత్ర అని చెప్పారు. గెజిటెడ్ అధికారులు మొదటి ప్రాధాన్య ఓటుతో తనను మద్దతు తెలుపాలని కోరారు.
బీజేపీ ఇప్పుడు ఒక బోగస్ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అణగదొక్కాలని చూస్తున్నది. రాష్ట్రంతో కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నది. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు పిచ్చికూతలు కూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లాంటి వాడు. బీజేపీ నాయకుల మాటలగారడీని నమ్మి ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పీఆర్సీ విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారు. టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవీలను భారీ మెజార్టీతో గెలిపించి టీజీవోల సత్తా చూపించాలి.
విపక్షాలన్నీ ఏకమైనా పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును ఆపలేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాల అడ్రస్ గల్లంతు కాక తప్పదు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నీ అమ్ముతూ ఉద్యోగాలను ఊడగొడుతున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మొపుతున్నది. అజ్ఞానంతో ఇక్కడి నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఎన్నికలు రాగానే ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. విపక్షాల అడ్రస్ గల్లంతు కాక తప్పదు.
– జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి