శాఫ్రాన్ కోసం నాలుగేండ్లుగా కేటీఆర్ కృషి
35 సార్లు సమావేశాలు, సంప్రదింపులు
ప్యారిస్లో శాఫ్రాన్ కేంద్ర కార్యాలయ సందర్శన
తెలంగాణలో పరిశ్రమకు సానుకూలతలపై వివరణ
ఫలితంగానే తెలంగాణకు నాలుగు యూనిట్లు రాక
తమ ఘనత అంటూ జోరుగా బీజేపీ ప్రచారాలు
హైదరాబాద్ జూలై 7 (నమస్తే తెలంగాణ): మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం రెండు యూనిట్లను కూడా శంషాబాద్లో ప్రారంభించింది. ఈ పరిశ్రమను తెలంగాణకు తీసుకొని రావడానికి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు నాలుగేండ్లకుపైగా కృషిచేస్తున్నారు. అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ కంపెనీని విస్తరణకు ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. శాఫ్రాన్ కంపెనీ విషయంలోకూడా మంత్రి కేటీఆర్ నాలుగేండ్లపాటు శ్రమించారు. ఆరునెలల క్రితం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వెళ్లి శాఫ్రాన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి కంపెనీని రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పించారు. నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ కంపెనీ హైదరాబాద్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది.
సోషల్ మీడియాలో బిల్డప్
మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ నేతలు మాత్రం ఇలాంటి సందర్భాలను సైతం రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నారు. శాఫ్రాన్ కంపెనీ ప్రతినిధులు కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ను సాంకేతిక అనుమతులకోసం మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. ఆయనే ఈ కంపెనీని తీసుకొచ్చారంటూ తెగ బిల్డప్ ఇచ్చుకొంటున్నారు. వాస్తవానికి చాలా కంపెనీల విషయంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీల విషయంలో రోజుల్లోనే తేలిపోవచ్చు. మరి కొన్ని కంపెనీల విషయంలో కొన్నేండ్లపాటు శ్రమించాల్సి ఉంటుంది. ముందుగా అంతర్జాతీయంగా విస్తరించడానికి ఆలోచిస్తున్న కంపెనీని గుర్తించాలి. విస్తరణకోసం ఆ కంపెనీతో సంప్రదింపులు మొదలుపెట్టాలి. భారత్లో పెట్టుబడులు పెట్టేలా వారిని సానుకూలంగా ఒప్పించాలి. ఆ తరువాత తెలంగాణ వైపు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించాలి. ఈ క్రమంలో వాళ్ల కాలమాన పరిస్థితుల ప్రకారం రేయింబవళ్లు అన్న తేడా లేకుండా అర్ధరాత్రి పొద్దుపోయాక కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చర్చించాల్సి ఉంటుంది. ఇందుకు సుదీర్ఘ కసరత్తు అవసరం. ఎంతో సహనం అత్యవసరం. ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇందుకు సంబంధించిన వివరాలు బహిర్గత పరచడానికి ఎంతమాత్రం వీలుండదు. ఈ కంపెనీలు ముందుగానే నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని చేసుకొంటాయి. తానుగా పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించేవరకు వెల్లడించడానికి అవకాశం లేదు. అలా చేస్తే ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుంది. అందువల్లనే వీటిని గురించిన సమాచారాన్ని ముందుగా చెప్పడం సాధ్యం కాదు. శాఫ్రాన్ విషయంలో ఇదే జరిగింది. కంపెనీ అధికారికంగా ప్రకటించడానికి ముందే.. ఆ కంపెనీ ప్రతినిధులు రాజ్నాథ్సింగ్ను కలిసిన ఫొటోను బీజీపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గాల్లోకి వదిలేసింది. ‘మేమే తెచ్చాం.. మేమే తెచ్చాం’ అంటూ ఊదర గొట్టడం మొదలుపెట్టింది.
కేటీఆర్ దార్శనికత
వాస్తవానికి శాఫ్రాన్ కంపెనీని హైదరాబాద్కు రప్పించడానికి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నాలుగేండ్ల క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కంపెనీ కార్యకలాపాలను తెలంగాణకు విస్తరింపజేయాలని హైదరాబాద్లో, ఢిల్లీలో, ప్యారిస్లో దాదాపు 35 సార్లు సమావేశమయ్యారు. 400కు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. 2021 అక్టోబర్లో ప్యారిస్ వెళ్లి అక్కడ శాఫ్రాన్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. ఇంత కష్టపడితే.. శాఫ్రాన్కు చెందిన ఎమ్మార్వో, ఎలక్ట్రిక్ హార్నెస్, లీప్ ఇంజిన్స్, ఐటీ సెంటర్ హైదరాబాద్కు వచ్చాయి. త్వరలో యూనివర్సిటీ కూడా రాబోతున్నది. ఒక కంపెనీ రావడం వెనుక ఇంత తతంగం నడిచింది. అంతకుముందు కిటెక్స్ కంపెనీ కేరళ నుంచి వైదొలగడానికి నిశ్చయించుకొన్నదని తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 24 గంటల వ్యవధిలో ఆ కంపెనీ ప్రతినిధులను సంప్రదించి.. చర్చలు జరిపి.. హెలికాప్టర్ ఇచ్చి హైదరాబాద్ రప్పించి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించి తీసుకొని రాగలిగారు. టెక్ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ నిరుడు సెప్టెంబర్లో హైదరాబాద్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం వచ్చినప్పుడు వర్షం పడితే.. పెద్ద మనిషికి గొడుగుపట్టి ముందుకు తీసుకెళ్లిన హుందాతనం మంత్రి కేటీఆర్ది. వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల హుందాతనం, గౌరవం ప్రదర్శించడం మంత్రి కేటీఆర్లోని ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. బీజేపీ నేతలకు రాజకీయం తప్ప మరేమీ కనిపించదు.. వినిపించదు. మంత్రి కేటీఆర్ కష్టాన్ని అప్పణంగా క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడానికి నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా బీజేపీ వాళ్లు అంత తోపులైతే వాళ్ల పాలిత రాష్ర్టాల్లోకి ఇలాంటి కంపెనీలు ఎందుకు రావడం లేదు?
మర్యాదగా కలిసినా.. తమ ఖాతాలోకి..
ఘనత వహించిన బీజేపీ నాయకులు ఎంతమాత్రం జంకూగొంకూ లేకుండా.. తామేదో తెగ కష్టపడి సదరు కంపెనీని తెలంగాణకు తెచ్చినట్టు సోషల్మీడియాలో ఓ కేంద్రమంత్రిని కంపెనీ ప్రతినిధులు కలిసిన ఫొటోను పెట్టుకొని తెగ ప్రచారం చేసుకొంటున్నారు. రైల్వేలు, విమానాలు, రక్షణ.. వంటి కొన్ని కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే విదేశీ కంపెనీలు.. ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు.. సాంకేతికపరమైన తుదిదశ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సంబంధితశాఖల మంత్రులను కలవటం పరిపాటి. ఇంతకు మించి.. ఆయా కంపెనీల విస్తరణ ప్రతిపాదనలపై సంప్రదింపుల ప్రక్రియలో కానీ.. ఒప్పందాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏకాణా ఉండదు గాక ఉండదు.