Bandi Sanjay హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా నువ్వా-నేనా అన్నట్టు తలపడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కుమ్ములాటలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. వారి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఇప్పటికే రిపోర్టులు తెప్పించుకున్న కేంద్ర నాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. బండి-ఈటల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్ శనివారం వారిద్దరితో భేటీ ఏర్పాటు చేశారు.
రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ భేటీ అనంతరం బండి-ఈటల ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇకనైనా వీరిద్దరూ తమ వైరాన్ని పక్కనపెట్టి కలిసి పనిచేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈటలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆధిపత్యం కోసం ఈ ఇద్దరు నేతలు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్నవారికే మద్దతు తెలిపారన్న ప్రచారం నడిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు పవర్ సెంటర్లుగా ఉన్న ఈ ఇరువురు నేతలు ఓ సందర్భంలో మీడియా ముందు పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నాటి నుంచి ఎవరికీ వారు తమ క్యాడర్ను ప్రోత్సహిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు నేతల అనుచరుల మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తున్నది. దీనివల్ల భవిష్యత్తులో బీజేపీకి నష్టం తప్పదనే అంచనాకు వచ్చిన అధిష్టానం బండి-ఈటల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.