హైదరాబాద్: తెలంగాణలో ముస్లింల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ సభలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేయడం తప్ప.. తెలంగాణపై బీజేపీకి ఎటువంటి విజన్ లేదని ఓవైసీ అన్నారు. ఆయన తన ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ.. ఓవైసీ అంటూ మీరింకెన్నాళ్లు రోదిస్తుంటారని, ఉత్త డైలాగులు ఎన్నాళ్లు చెబుతారని, కొన్ని సార్లు వాస్తవాలు కూడా మాట్లాడాలన్నారు. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఉందని, నిరుద్యోగం కూడా తారస్థాయికి చేరినట్లు ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Sir @AmitShah
ye “owaisi owaisi” ka rona kab tak chalega? Khaali khattey dialog’aan maarte rehte. Please sometimes speak about record-breaking inflation & unemployment also. Telangana has the highest per capita income in the countryModi allegedly says reach out to pasmanda…
— Asaduddin Owaisi (@asadowaisi) April 23, 2023
దళిత ముస్లింలను ఆదరించాలని ప్రధాని మోదీ చెబుతుంటారని, కానీ వాళ్ల రిజర్వేషన్లను తొలగించాలని అమిత్ షా మాట్లాడడం శోచనీయమని ఓవైసీ అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప.. తెలంగాణ వృద్ధిపై బీజేపీకి విజన్ లేదన్నారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం.. హైదరాబాద్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం, కర్ఫ్యూలు పెట్టడం, క్రిమినల్స్ను వదిలేయడం, బుల్డోజర్లను దింపడమే ఆ పార్టీకి తెలుసు అని ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని షాను ఓవైసీ ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు న్యాయం చేయాలని షా అనుకుంటే, అప్పుడు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్ను రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డేటా ఆధారంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, సుధీర్ కమీషన్ రిపోర్టును చదువాలని, సుప్రీం స్టే ఇవ్వడంతో.. ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నట్లు ఓవైసీ గుర్తు చేశారు.