PSU’s | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే దేశంలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు బీజేపీ మాటిచ్చింది. నిరుద్యోగం అంతమే తమ పంతమన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికలయ్యాక అలవాటు ప్రకారం మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు తెస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ)లను అమ్మడమే పనిగా పెట్టుకొని వీటిల్లో ఉద్యోగాలకు కోత పెడుతున్నది. గత పదేండ్లలోనే 2.7 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. మరోవైపు పీఎస్యూల్లో కాంట్రాక్టు, రోజూవారి కార్మికులను పెంచుతున్నది. 2013 నాటికి మొత్తం 389 పీఎస్యూల్లో 17.3 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. 2023 మార్చి నాటికి వారి సంఖ్య 14.6 లక్షలకు తగ్గిపోయింది. ఒక్క బీఎస్ఎన్ఎల్లోనే 1,81,127 ఉద్యోగాలు తగ్గాయి. వీఆర్ఎస్ స్కీమ్ల పేరుతో ఆ సంస్థలో ఉద్యోగులను కేంద్రం బలవంతంగా బయటకు పంపించింది. ఎఫ్సీఐ, ఓఎన్జీసీ వంటి అనేక పీఎస్యూల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కేంద్రం భారీగా తగ్గించేసింది.
ఉత్పాదకతపై ప్రభావం
ఒకవైపు పీఎస్యూల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న కేంద్రం కాంట్రాక్టు, రోజువారి కార్మికుల సంఖ్యను పెంచుతున్నది. 2013లో పీఎస్యూల్లో 40 వేల మంది రోజువారి కార్మికులు, 2.9 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు ఉంటే ఇప్పుడు రోజువారి కార్మికులు లక్ష మంది, కాంట్రాక్టు కార్మికులు 5.2 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం పీఎస్యూల్లోని మొత్తం ఉద్యోగుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు 42.5 శాతానికి పెరిగిపోయారు. శాశ్వత ఉద్యోగులతో పోల్చితే కాంట్రాక్టు, రోజువారి ఉద్యోగులకు ఉండే నైపుణ్యాలు, అనుభవం తక్కువ. ఇది మొత్తంగా సంస్థ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది.
ఇష్టారీతిన అమ్మకం
దశాబ్దాలుగా జాతి నిర్మాణంలో భాగమై, లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థలను బీజేపీ ఇష్టారీతిన అమ్మేస్తున్నది. పీఎస్యూలు గుదిబండగా మారాయని, నష్టాలు తెచ్చిపెడుతున్నాయనే నెపంతో అమ్మకానికి పెడుతున్నది. అయితే పీఎస్యూల్లో లాభాలు తెచ్చేవి కూడా ఉన్నాయి. ఇవేమీ పట్టని కేంద్రం పీఎస్యూల్లో ఉత్పాదకత తగ్గిందన్న ఒక్క మాటే సాకుగా చెప్తూ వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నది.