హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు ఏజెంట్లే మూల స్తంభాలని, ఐఆర్డీఏఐ నిబంధనలు ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెం ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐఏఎఫ్ఐ) నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్సూరెన్స్ రంగాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, అందులో భాగంగానే ఏజెంట్ల వ్యవస్థపై కత్తికట్టారని ఆరోపించారు. ఏజెంట్ల విశ్వాసాన్ని, పాలసీదారుల పొదుపును కొల్లగొట్టేందుకే నూతన విధానాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు మంగళవారం ‘రెస్ట్ డే’ పేరుతో దేశవ్యాప్తంగా భారీ నిరసన చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని పలు సిటీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద ఎల్ఐసీ ఏజెంట్లు భారీ సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నేతలు మాట్లాడుతూ.. ఏజెంట్లకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను తీసుకొచ్చేందుకు ఐఆర్డీఏఐ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో ఏజెంట్ల ద్వారానే పాలసీలు చేర్పించటం సముచితమని అన్నారు. తమ ద్వారానే ఎల్ఐసీ వ్యాపారం విస్తరిస్తుంటే.. ఐఆర్డీఏఐ నిబంధనల పేరుతో తమ కుటుంబాలను రోడ్డు పడేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఏజెంట్లకు చెల్లించే కమీషన్, బీమాపాలసీల కొనసాగింపు వంటి విషయాల్లో నిబంధనలు కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని తాము ఒప్పుకునేది స్పష్టంచేశారు.