హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జీ-20 దేశాల కూటమికి ఆతిథ్యం వహించే అవకాశం భారత్కు రావడం మంచి విషయమే. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న పరపతిని చూసి జీ-20 సభ్యదేశాలు తీర్మానం చేసి ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాయంటూ బీజేపీ హడావుడి చేస్తున్నది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ ప్రచారం చూసి విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. పైగా మోదీ ఘనతగా చెప్పుకొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంపై విస్మ యం చెందుతున్నారు. వాస్తవానికి జీ-20 అధ్యక్ష పదవులు రొటేషన్ పద్ధతిలో నిర్ణయిస్తారు.
ఈ కూటమి 1999లో ఏర్పాటైంది. 2008 నుంచి ఏడాదికి ఒకసారి ఒక్కో సభ్యదేశంలో సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు హాజరవుతున్నారు. మొత్తం 20 దేశాలను 5 గ్రూపులుగా విభజించి.. ఎప్పుడు ఏ దేశంలో సదస్సులు జరగాలో క్యాలెండర్ను నిర్ణయించారు. ఈ మేరకు 2023లో భారత్ అధ్యక్షత వహించాలని గతంలోనే తీర్మానం చేశారు. ఈ మేరకే ఇండోనేషియా అధ్యక్షుడు ఇటీవల ప్రధాని మోదీకి బాధ్యతలను అప్పగించారు. అంతేతప్ప మోదీ పరపతి పెరగడం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మోదీ కాకుండా వేరే ఏ ప్రధాని ఉన్నా అధ్యక్ష బాధ్యతలు వచ్చేవని చెప్తున్నారు. 2024లో బ్రెజిల్లో, 2025లో దక్షిణాఫ్రికాలో జరుగాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పుడు ఆ దేశానికి ఎవరు ప్రధాని/అధ్యక్షుడు ఉన్నా వారికే బాధ్యతలు ఇస్తారని, వాళ్ల మొహం చూసో, పరపతి చూసో కాదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.