హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘తెలంగాణ సాయు ధ పోరాట (1946-51) వార్షికోత్సవాలు, తెలంగాణ విలీన దినోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా అనేక త్యాగాలతో జరిగిన పోరాట చరిత్రను ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు ఆనాడు బ్రిటిషర్లు, నిజాం, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగించారని వివరించారు.
సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వమని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలతో కూడిన పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. తొలుత వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ అనంతరం ఆర్టీసీ క్రాస్రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నేతలు పాల్గొన్నారు.