హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశానికి బీజేపీ ప్రమాదకరశక్తిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే శక్తిగా ముందుకొస్తున్నదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో బీజేపీ అడుగుపెట్టకుండా తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అనర్హత వేటును తక్షణమే తొలగించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉమ్మడిగా ప్రజా ఉద్యమాలు చేపడతామని, రాబోయే ఎన్నికల్లో కలిసే ముందుకు సాగుతామని ప్రకటించారు. ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉమ్మడి పార్టీల ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ సమావేశానికి ఉభయ పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఐక్యత విషయంలో సీట్ల సర్దుబాటు అంశం ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు. సమావేశంలో ఇరు పార్టీల నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, పశ్యపద్మ, చెరుపల్లి సీతారాములు, జాన్ వెస్లీ పాల్గొన్నారు.