హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో కనిపించిన వస్తువునల్లా ధ్వంసంచేస్తూ వీధి రౌడీల్లా ప్రవర్తించారు. పక్కా పథకం ప్రకారం తమ అనుచరులతో ఆఫీస్లోకి ప్రవేశించిన కార్పొరేటర్లు మొదటి అంతస్తులోని మేయర్ చాంబర్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతాసిబ్బంది అడ్డుకోవటంతో కమిషనర్ చాంబర్వైపు పరుగులు పెడుతూ పూలకుండీలు, కుర్చీలను ధ్వంసంచేశారు. కార్యాలయంలోని మైక్లను విరిచేశారు. అద్దాలు పగులగొట్టారు. మైలార్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి జీహెచ్ఎంసీ లోగోపై ఇంకును స్ప్రే చేశారు. బీజేపీ కార్పొరేటర్ల బీభత్సంతో మేయర్, డిప్యూటీ మేయర్, కార్యదర్శి భయంతో చాంబర్ల తలుపులు మూసుకున్నారు. కొర్పొరేటర్లు చిల్లర గూండాల్లా భవనమంతా పరుగులు పెట్టడంతో కార్యాలయ సిబ్బంది బేంబేలెత్తిపోయారు. బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత వారించినా కార్పొరేటర్లు వినిపించుకోకపోవడంతో పోలీసులు వచ్చి పలువురు బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్టు చేసి సైఫాబాద్, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు న్యూసెన్స్ చేయడం, ప్రజా ఆస్తుల నష్టం కలిగించారని జీహెచ్ఎంసీ అధికారులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బీజేపీ కార్పొరేటర్లు పక్కా ప్రథకం ప్రకారమే జీహెచ్ఎంసీపై దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నదని తెలిసినా, సమస్యలు వినేందుకు మేయర్ అపాయింట్మెంట్ ఇచ్చినా విధ్వంసం సృష్టించాలన్న ఏకైక లక్ష్యంతోనే కార్యకర్తలతో కలిసి వచ్చి హల్చల్ చేశారు. ప్రజా సమస్యలను చర్చించటానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలున్నా దాడులతో భయానక వాతావరణం సృష్టించారు.
బీజేపీ కార్పొరేటర్ల దాడిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బంజారాహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చినా బీజేపీ కార్పొరేటర్లు ఎందుకురాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే గొడవచేశారని విమర్శించారు.