హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానమని విమర్శించారు. ఉప ఎన్నిక కోసం తెలంగాణను తగలబెడుతారా? అని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇస్లామ్, మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిందని మండిపడ్డారు.
రాజాసింగ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలి.. కానీ ఈ విధంగా కాదని హితవుపలికారు. ఎర్రకోటపై పెద్ద ప్రసంగం ఇచ్చిన మోదీకి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను వెంటనే అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల కార్యాలయాలు ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు.