మర్రిగూడెం: మునుగోడు ఉప ఎన్నికల్లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ మర్రిగూడెం మండలం దేవర భీమనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి.. బీజేపీ, కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతాయని ప్రశ్నించారు.
ఇది బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిన ఎన్నిక అని మంత్రి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నదని, ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించిందని,పెండ్లిళ్లకు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో నగదు సాయం చేస్తున్నదని, బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తున్నదని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి మిషన్ కాకతీయతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు బాగుచేసి నీళ్లతో నింపింది టీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంతకంటే మంచి పథకాలు అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలకు ప్రజలను ఓట్లడిగే మొకమే లేదని ఎద్దేవా చేశారు.
మునుగోడులో సాగునీటి కోసం శివన్నగూడెం, క్రిష్ణ రాయినిపల్లి, లక్ష్మణపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.