హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నింటా దగా చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాజీపేటకు రావాల్సిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్కు తరలించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మోసంచేస్తే, ఇప్పుడు బీజేపీ దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. ఉత్తుత్తి మాటలు చెప్పే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అబద్ధాలు చెప్పే అర్వింద్, ఏమీ పట్టనట్టు ఉండే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వీటికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. దమ్ముంటే రాష్ట్ర హక్కులను సాధించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడు అడిగినా దాటవేసి గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రలో స్థాపించి రూ.587 కోట్లు విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఇక్కడ పాదయాత్రలు చేస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతలకు సిగ్గూ..శరం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తేవాలని, లేదంటే వారికి రాష్ట్రంలో తిరిగే హక్కేలేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ర్టాలకు కేంద్రం మెడికల్ కాలేజీలు ఇస్తుంటే, ఇక్కడి బీజేపీ నేతలు కనీసం వారి సొంత నియోజకవర్గాల్లో అయినా కాలేజీలు తెచ్చుకోలేని దద్దమ్మలుగా మిగిలారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రం ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం విధానాలతో రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు.
పాదయాత్రలు ఢిల్లీకి చేయండి..
బీజేపీ నేతలు ఢిల్లీకి పాదయాత్రలు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలపట్ల బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర హక్కులు సాధించుకురావాలని డిమాండ్చేశారు. బండి సంజయ్ చేస్తున్నది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, తెలంగాణ ప్రజల వంచన యాత్ర అని దుయ్యబట్టారు. సంజయ్ పాదయాత్ర వరంగల్లో కాలుమోపేలోగా కేంద్రం కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై తేల్చాలని, లేదంటే యాత్రను అడ్డుకొంటామని హెచ్చరించారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై మోసం చేసిన బీజేపీ, హుజూరాబాద్లో ఓట్లెలా అడుగుతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ర్టానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్షాను ఇక్కడి బీజేపీ నేతలు కోచ్ ఫ్యాక్టరీ కోసం నిలదీయాలని డిమాండ్చేశారు.