హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మహాధర్నా సందర్భంగా సిరిసిల్లలో గురువారం మంత్రి కేటీఆర్ ఏఎన్ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని అంశాలను శుక్రవారం ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెల 1న పార్లమెంట్ను మాత్రమే కాకుండా, మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రపంచంలో, దేశంలో పార్బాయిల్డ్ బియ్యానికి డిమాండ్ లేదని, అందుకే భారత ప్రభుత్వం దానిని కొనుగోలు చేయడానికి నిరాకరించిందని గోయల్ చెప్పారని గుర్తుచేశారు.
అయితే డిసెంబర్ 1, 2021న మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన పంట పార్బాయిల్డ్ రైసా లేక రా రైసా అనే దానితో సంబంధం లేకుండా గత కొన్ని దశాబ్దాల మాదిరిగానే ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పారని పేర్కొన్నారు. ఇలా ఇద్దరు మంత్రులు వేరువేరు ప్రకటనలు చేసింది రైతులు, ప్రజలను మోసం చేసేందుకు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. వాస్తవానికి పార్బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమని నిరుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం రైతులకు వివరించే ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకోకుండా, స్థానిక బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధాన్యం సేకరిస్తామని చెప్పడంతో రైతులు ఈ ఏడాది 35 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారని తెలిపారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఢిల్లీ బీజేపీనా.. లేక తెలంగాణలోని సిల్లీ బీజేపీనా? చెప్పాలని డిమాండ్ చేశారు.