హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు.. తెలంగాణ బీజేపీ నాయకులతో లావాదేవీలు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను కీలక పాత్రలో ఉంటానంటూ ప్రచారం.. ఇదీ బేగంబజార్లో చిన్న కిరాణాషాపు నిర్వహణ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో కీలక సూత్రధారిగా ఎదిగిన నందకుమార్ అలియాస్ నందు ప్రస్థానమిది. బంజారాహిల్స్ రోడు ్డనంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న నందకుమార్ ఆది నుంచి కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి అనుయాయుడిగానే ఉన్నాడు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని మోత్కూరు.. నందకుమార్ సొంత ఊరు. ఈయన తండ్రి పేరు కోరె శంకరప్ప. చాలా ఏండ్ల కిందటే శంకరప్ప నగరానికి వచ్చారు. బేగంబజార్లో చింతపండు, బియ్యం వ్యాపారం చేస్తున్నారు. శంకరప్ప అఫ్జల్గంజ్ పీఎస్ పరిధిలోని మైత్రి కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.
నందకుమార్ గతంలో అంబర్పేట పరిధిలోని శివం రోడ్డులో సీజన్స్ హోటల్ను నడిపారు. ఆ తర్వాత ఫిలింనగర్లో డబ్ల్యూ.3 పేరుతో సుమారు ఎనిమిదేండ్ల క్రితం బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసి సినీ నటులు, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంచుకొన్న నందకుమార్ తన మాటకారితనంతో వారిని ఆకట్టుకొన్నాడు. ఇదే క్రమంలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు లంకల దీపక్రెడ్డి ఢిల్లీలో పలుకుబడి ఉన్న కొందరు బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగించాడు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, జితేంద్రసింగ్తోపాటు హోం శాఖ మంత్రి అమిత్షా కొడుకు జై షా తనకు అత్యంత సన్నిహితంగా ఉంటాడని పలు సందర్భాల్లో తన స్నేహితులతో నందకుమార్ చెప్పేవాడని తెలుస్తున్నది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బావమరిది శ్రీనివాస్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని, రానున్న ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చినట్టు కూడా తాజాగా తెలుస్తున్నది. కొంతకాలం కిందట డబ్ల్యూ.3 బార్ అండ్ రెస్టారెంట్ స్థానంలో దక్కన్ కిచెన్ పేరుతో హోటల్ను ఏర్పాటుచేశారు. దీనిని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
2007 నుంచి అన్న తెలుసు
నందకుమార్ వీడియో వైరల్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్రెడ్డి తనకు ఎన్నో ఏండ్లుగా తెలుసునని, తన వ్యాపారాల ప్రారంభానికి వస్తారని, కిషన్రెడ్డి తనకు లక్కీ హ్యాండ్ అంటూ డెక్కన్ ఫ్రైడ్ హోటల్ యజమాని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల్లో అడ్డంగా దొరికిన నందకుమార్ చెబుతున్న వీడియో వైరల్గా మారింది. పోలీసులకు పట్టుబడిన నందకుమార్ ఎవరో తనకు తెలియదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పలు టీవీ చానెళ్లకు లైవ్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో తనకు ఉన్న అనుబంధం గురించి నందకుమార్ వివరిస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీ ‘అన్నగారు (కిషన్రెడ్డిని ఉద్దేశించి) 2007 నుంచి పరిచయం. నేను మొట్టమొదటిసారిగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంబర్పేటలోనే మొదటి హోటల్ పెట్టాను. ఆ హోటల్ను అన్నగారి చేతులమీదుగానే ఓపెన్ చేయించాను. అన్నగారిది నాకు లక్కీ హ్యాండ్. అన్నగారు వచ్చి రిబ్బన్లు కట్ చేసినప్పుడల్లా ఇంకా వ్యాపారాలు పెంచుకుంటూనే పోతున్న’ అని చెబుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.