నిజామాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి, ఓసీకి పదవి కట్టబెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆమె నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పర్యటనలో భాగంగా కేసీఆర్ సర్కారుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మోదీ మాట తీరు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని మండిపడ్డారు.
తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్లో తెలంగాణ ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. రాహుల్గాంధీ కూడా కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన చేయలేదని, మన హక్కుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. అటువంటి పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో సీఎం కేసీఆర్ బీసీల కోసం రూ.6,200 కోట్లు కేటాయించారని చెప్పారు.
మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభు త్వం ఎంతో చేసిందని ఎమ్మెల్సీ కవిత వివరించారు. గత పదేండ్లలో 204 పాఠశాలలు పెట్టి లక్ష మందికి విద్యను అందిస్తున్నదని చెప్పారు.బీఆర్ఎస్తో పోల్చుకునేంత గొప్ప పనులేవీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్గుప్తాను ప్రజలు ఆదరిస్తారని, బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెప్పారు.