పెద్దపల్లి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో దేశం అట్టుడుకుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేంద్ర సర్కారు నల్ల చట్టాలను తెచ్చి రైతులను పొట్టనబెట్టుకున్నదని, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచి మహిళలను మోసగించిందని, జీఎస్టీని తెచ్చి వ్యాపారులను నిలువునా ముంచిందని దుయ్యబట్టారు. తాజాగా దేశ రక్షణ కోసం పని చేయాలనుకొనే యువ త తమ హక్కుల కోసం పోరాడితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని హరీశ్రావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎస్ఎల్బీ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశానికి రక్షణ కవచంలా నిలబడాలనే ఉత్సాహంతో ఉన్న యువత ఆశలు, ఆశయాలపై అగ్నిపథ్ పథకంతో బీజేపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. ఉద్యోగ భద్రత ఉండదనే ఆవేదనతో యువత ఆందోళనలు చేస్తే దేశ ద్రోహులంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. వాళ్లేమైనా సంఘ విద్రోహ శక్తులా? అని ప్రశ్నించారు. యువతను మోసగించే విధానాలను మానుకోవాలని హితవుపలికారు.
సికింద్రాబాద్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉన్నదంటున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, యూపీ పోలీస్స్టేషన్ దహన ఘటనలో అక్కడి బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమేయం ఉన్నదా? చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్పై ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నా పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం నోటిఫికేషన్ను సైతం విడుదల చేసిందని విమర్శించారు. బీజేపీకి రాష్ర్టాల్లో మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప అభివృద్ధి చేత కాదన్నారు.
డబుల్ డెక్కర్, డబుల్ ఇంజిన్ అని చెప్తున్న బీజేపీ నేతలు.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం, ప్రధాని ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ పేదలకు వైద్యం అందించడంలో 28వ స్థానంలో నిలిచిందని ఎద్దేవాచేశారు. అదే బీజేపీ, కాంగ్రెస్యేతర ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని గుర్తుచేశారు. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ చెప్పిందన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ డెక్కర్ కాదని.. డబుల్ టక్కర్ అని, డబుల్ ఇంజిన్ కాదని.. ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ఎయిర్ ఇండి యా, రైల్వే, విశాఖ ఉక్కు, బ్యాంకింగ్ రంగాలతోపాటు మరిన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేసిందని గుర్తుచేశారు. వీటన్నింటికీ బీజేపీ నాయకులు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో 9.50 లక్షలు, ఆర్మీలో 3 లక్షలు, రైల్వే 3 లక్షలు, ఎల్ఐసీ, బ్యాంకింగ్లో 50 వేల పోస్టు లు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాక ముందు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా.. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో రూ. 2.75 లక్షలు పెరిగిందన్నారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి టీఆర్ఎస్ ప్రభుత్వం 2.50 లక్షల ఉద్యోగాలను ఏడేండ్లలో భర్తీ చేసిందని గుర్తుచేశారు.
కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు పూర్తయిందంటే టీఆర్ఎస్తోనే తప్ప బీజేపీ, కాంగ్రెస్లతో జీవితంలో కూడా సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి విద్య, వైద్యాన్ని చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.