హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అమిత్షా ప్రస్తుతం అహ్మదాబాద్ ర్యాలీలో ఉన్నారని, రాత్రికి వచ్చిన తర్వాత ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పీఠాధిపతి హై ర్యాంకు అని, తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సైతం వచ్చి తన ఆశీర్వాదం తీసుకుంటారని సింహయాజీ అన్నారు. వారి సంభాషణ సాగిందిలా..
రేగా కాంతారావు : అన్నీ మంచిగయితే పీఠానికి పోదాం తిరుపతికి.
సింహయాజి: అంతా మంచిగనే అయితది మా సంకల్పం వలన.
రేగా: మా పైలట్ సాబ్ ఎట్లా చెప్తే అట్లా.
సింహయాజి : పైలట్ అంటే ఎయిర్ల తీసుకపోతడు నిన్ను. ఎట్ల తీసుకపోతే అట్లా.
రేగా : ఎన్నోసార్లు రమ్మంటున్నడు నన్ను. బయటికి పోదాం రమ్మని చెప్పి.
(కాసేపు పిచ్చాపాటి సంభాషణ)
నందకుమార్ : మేము గతంలో కలిసినం గుర్తుందా?.
రేగా : లేదు..
నంద : అప్పట్ల.. ఢిల్లీలో బలరాం నాయక్ ఇంట్ల. పదేండ్ల కింద. తాజ్లో ఫంక్షన్కు కూడా పోయినం.
రేగా : పది సంవత్సరాల కింద అంటే ఏం…
నంద : దిగ్విజయ్ సింగ్ను కలిసినం. సత్యవతి మీరు, భట్టి, నేను.
సింహయాజి: కాషాయం వేసుకున్నోడల్లా పీఠాధిపతి అని చెప్పుకుంటారు. వాళ్లు పీఠాధిపతులు కాదు. సన్యాసులు.
గువ్వల : పీఠాధిపతి అంటే ఎక్కువనా?
సింహయాజి: సన్యాసం కన్నా పై స్థానంలో ఉంటుంది.
నంద : పీఠాధిపతి కావాలంటే చాలా క్వాలిఫికేషన్లు కావాలి.
సింహయాజి : మా ర్యాంకు చాలా హై ఉంటుంది. చిన్న జీయర్ స్వామి కూడా పీఠాధిపతి కాదు.
నంద : తిరుమల రమణ దీక్షితులు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వామివారిని పట్టుకునే శక్తి ఆయనకు (రమణ దీక్షితులు) ఉంది. వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటడు ఆయన. ఆయనే వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకుంటాడు.
రామచంద్ర భారతి : ఇప్పటిదాకా తుషార్తో మాట్లాడాను. తుషార్ ఈ విషయాన్ని సంతోష్కు చెప్పారు. మీరు ఢిల్లీకి వచ్చిన తర్వాతే మొత్తం డబ్బు ఇద్దామని, ముందే అంటే ఎలా ఇవ్వగలుగుతామని వాళ్లు చర్చిస్తున్నారు. అమిత్ షా తర్వాత మాట్లాడుదామని అన్నాడట. కచ్చితంగా ఎప్పుడనేది చెప్పలేదు. సంతోష్ కూడా ఢిల్లీలోనే డెలివర్ చేద్దామని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా అడగలేదట. మనం మాత్రమే ఇక్కడే ఇవ్వాలని అంటున్నాం.
పైలట్ : కానీ మీరు మొదటి నుంచీ ఇదే చెప్తున్నారు కదా స్వామి. మనం చర్చించాం కదా.
నంద : ఫస్ట్ హైదరాబాద్లో ఇవ్వాల్సిందే.
రామచంద్ర : వాళ్లు హైదరాబాద్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
నంద : ఇక్కడ కూడా ఇస్తా అంటున్నారు అన్నా.. కానీ మీరు..
పైలట్ : నేను చెప్పలేదా ముందుగాల్లనే..
నంద : హైదరాబాద్లో ఇస్తా అంటున్నరు.
పైలట్: ముందుగాల్ల చెప్పలేదా నీకు. ఆరో జు మనం ఫోన్ లో కూడా మాట్లాడినం కదా.
రామచంద్ర : నేను ఈ విషయాన్ని వినలేదు. అందుకే వాళ్లకు చెప్పలేదు. అయినా.. హైదరాబాద్లోనే ఇవ్వాలని వాళ్లకు చెప్పాను. వాళ్లు అంగీకరించారు. హైదరాబాద్లో 50 శాతం ఇవ్వాలని, మిగతాది అక్కడ ఇవ్వాలని నేను ఈరోజే వాళ్లకు చెప్పాను.
పైలట్ : వాళ్లు ఏమంటున్నారు.
రామచంద్ర : తుషార్ కూడా నాలాగే అనుకున్నాడట. కానీ.. ముందు ఇక్కడ 50 శాతం కావాలి ఆ తర్వాతే వాళ్లు ఢిల్లీ వస్తారని నేను స్పష్టంగా చెప్పాను. అయితే సంతోష్ మా త్రం.. ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాకే ఇద్దామని అంటున్నారట. కాబట్టి ఈ అంశంపై అమిత్ షాతో చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తానన్నారు. అమిత్ షాకు ఫోన్ చేస్తే కలవడం లేదని తుషార్ చెప్పారు. నాకు తెలిసి ఈ రాత్రికి అందుబాటులోకి వస్తారు. అమిత్ షా ఇప్పుడు అహ్మదాబాద్ ర్యాలీలో ఉన్నారు. అది ఆయన సొంతూరు.