చండూరు : బీజేపీ పార్టీ అవినీతి, ప్రజావ్యతిరేకులకు కేరాఫ్ అడ్రస్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మాధవరం కృష్ణారావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనుల కోసం బీజేపీలో చేరాడని ఆరోపించారు. అతడిని మునుగోడు ప్రజలు ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మత విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటేనని ఆరోపించారు. తెలంగాణ ను అన్ని రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దింది, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ను అంతం చేసింది కేసీఆరే నని వారు వెల్లడించారు. నవంబర్ 3 నాడు జరుగనున్న మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తు సునామీ సృష్టిస్తోందని, 50 వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం తథ్యమని అన్నారు.
హుజురాబాద్ లో మాయ మాటలు చెప్పి గెలిచినా, మునుగోడు లో మాత్రం బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.