Bittiri Satti | హైదరాబాద్ : తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్రావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా అని ప్రశ్నించారు. ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నడు, అవతలి వైపు ఎవరు ఉన్నారని నిలదీశారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని స్పష్టం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ న్యూ యార్క్ లెక్క అభివృద్ధి చెందింది అన్నారని హరీశ్రావు గుర్తు చేశారు. పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు. మళ్ళీ కేసీఆర్ రాకుంటే బిజినెస్ అవుట్ అని భయ పడుతున్నారట. అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుంది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారు అని పేర్కొన్నారు.
ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్ గిరి.. సహా హైదరాబాద్ అన్ని నియోజకవర్గాలు గెలిపించాలని కార్యకర్తలను మంత్రి కోరారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదు. అన్ని సర్వేలు ఇదే చెబుతున్నాయి. బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ కొడతారు. దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా మోసం ఉండదు, ద్రోహం ఉండదు. అందర్నీ కాపాడుకునే పార్టీ బీఆర్ఎస్ అని హరీశ్రావు తేల్చిచెప్పారు.