హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు శుక్రవారానికి కేరళను తాకేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు బుధవారం తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపుతున్నదని, జూన్ 12 నాటికి తుఫాను క్షీణించి రుతుపవనాల ప్రభావం పెరుగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు తెలంగాణలో మరో మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం బలహీనపడిందని పేర్కొన్నది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి.