హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు.. ఈ ఏడాది ఎప్సెట్ పరీక్షల్లో ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని (ఫేషియల్ రికగ్నిషన్) అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి టెస్టింగ్స్ నిర్వహిస్తుండగా, అంతా సవ్యంగా ఉంటే ఈ ఏడాదే అమలు చేయనున్నారు. లేదంటే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం తప్పనిసరిగా అమలవుతుంది.
ఎప్సెట్లో ఇప్పటివరకు బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నారు. కుడి చేతి బొటనవేలి ముద్రను కూడా తీసుకుంటారు. ఈసారి వీటితో పాటు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో దరఖాస్తు సమయంలో విద్యార్థి అప్లోడ్ చేసిన ఫొటోను, పరీక్షకు వచ్చినప్పుడు క్యాప్చర్ చేసిన ఫొటోను రెండింటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలిస్తారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తారు.
విద్యార్థి పోలికలు సరిపోతేనే సాఫ్ట్వేర్ ఆయా విద్యార్థిని పరీక్షకు అనుమతిస్తుంది. దీంతో పరీక్షకు వచ్చిన వారు అసలు విద్యార్థియా? లేక నకిలీ విద్యార్థా? అన్నది ఇట్టే తేలిపోతుంది. ఈ విధానాన్ని అమలుచేసేందుకు ఆదివారం నిపుణుల సమక్షంలో టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్ తర్వాత అమలుచేయాలా? వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఎప్సెట్కు 3.5లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్కు 2.5లక్షలు, అగ్రికల్చర్, ఫార్మసీకి 98వేల మంది దరఖాస్తు చేసుకొన్నారు. మే 7, 8న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11న ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు జరగనున్నాయి. సోమవారం ఉదయం నుంచే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.