హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్కు ఉన్న ఖ్యాతిని సుస్థిరం చేస్తూ ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ (బీఈ) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో మరో రూ.1,800 కోట్ల పెట్టుబడితో కొత్తగా 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనరిక్ ఇంజెక్ట్బుల్స్, వ్యాక్సిన్ల తయారీ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఏర్పాటుచేసే ఈ కేంద్రాల్లో 2,518 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్, పెర్టుసిన్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపుల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్లు, ప్రత్యేక జనరిక్ ఇంజెక్ట్బుల్స్ తయారు చేయనున్నట్టు వివరించారు.
1,400 కోట్ల డోసుల వ్యాక్సిన్లు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు భాగం హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా 900 కోట్ల డోసుల వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. బీఈ తాజా పెట్టుబడులతో హైదరాబాద్లో అదనంగా మరో 500 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్, ఆర్అండ్డీ క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతోపాటు అత్యుత్తమ పరిశ్రమలు, నాలెడ్జ్ పార్క్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, అద్భుతమైన ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీఈతోపాటు నోవార్టిస్, గ్లాక్సో స్మిత్ైక్లెన్, ఫెర్రింగ్ ఫార్మా, కీమో, డ్యూపాంట్, ఆష్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా, లోంజా తదితర 200కుపైగా కంపెనీలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిలో దాదాపు 15 వేల మంది పనిచేస్తున్నారు.
హైదరాబాద్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది: కేటీఆర్
జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్-ఈ కార్యకలాపాల విస్తరణ ప్రణాళిక పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్కు ఉన్న ఖ్యాతి బీఈ ప్రణాళికతో మరింత ఇనుమడిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో ఎన్నో కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని మహిమా దాట్ల ప్రశంసించారు. దీంతో కొవిడ్ సంక్షోభ సమయంలోనూ తమ సంస్థ విస్తరణకు శీఘ్ర నిర్ణయాలు తీసుకొన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు లభిస్తున్న సహకారంపై సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీఈ ప్రస్థానం
1953లో ప్రారంభమైన బయోలాజికల్-ఈ దక్షిణ భారతదేశంలోనే మొదటి ఔషధ తయారీ సంస్థ. దేశంలో బయోలాజికల్ ఉత్పత్తులను తయారుచేసిన తొలి ప్రైవేట్ సంస్థ ఇదే. ప్రస్తుతం 4 వ్యూహాత్మక వ్యాపార విభాగాలను కలిగి ఉన్న బీఈకి తెలంగాణలో 6 తయారీ కేంద్రాలు న్నాయి. ప్రత్యక్షంగా 5 వేలమందికిపైగా ఉపాధి పొందుతున్నారు. కొవిడ్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ఈ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కార్బీవాక్స్’ వ్యాక్సిన్ను 5-12 ఏండ్లలోపు పిల్లలకు అత్యవసరంగా వినియోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి బీఈ 50 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకొన్నది.
బయోలాజికల్-ఈ భారీ పెట్టుబడి
ట్విట్టర్ ద్వారా కేటీఆర్ హర్షం
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రూ.1800 కోట్ల మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ.. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్ విస్తరణకు ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “బయోలాజికల్-ఈ విస్తరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఏడాదికి 14 బిలియన్ డోస్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఇప్పటికే హైదరాబాద్కు “వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్”గా పేరున్నది, ఈ విస్తరణ మన బలాన్ని మరింత పెంచింది” అని మంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.