హైదరాబాద్ : వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షత నియమించిన మావన – జంతు సంఘర్షణల నివారణ సూచనల కమిటీ శనివారం అరణ్య భవన్లో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిటీ చర్చించింది. దక్షిణాది రాష్ట్రాల్లో నష్ట పరిహారం చెల్లింపులు విధానాలపై కమిటీ ఆరా తీసింది.
ఆవాసాలను నాశనం చేస్తుండటంతో జనావాసాల్లోకి…
రాష్ట్ర ఆవిర్భావం నుంచి నష్టపరిహారం చెల్లింపుపై ఎలాంటి సవరణ చేయలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. మానవ- జంతు సంఘర్షణ నివారణకు సూచలివ్వాలని మంత్రి కమిటీని ఆదేశించారు. మూడు నెలల్లోపు సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పారు. వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేయడం, అడవులను నరకడంతో అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, నీటి వనరులను పెంచాలని కమిటీ సభ్యులు సూచించారు.
జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకోవాలి..
వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ప్రధాన పులుల ఆవాసాల్లో ఆకలి తీర్చే వన్యప్రాణుల (ప్రే యానిమల్) మేత కోసం మూడేళ్ల కార్యాచరణను ప్రవేశపెట్టాలన్నారు. పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా, వన్యప్రాణులు అడవి నుంచి బయటకు రాకుండా చుట్టూ కందకాలు తీయాలి. వన్యప్రాణులను వేట, ఉచ్చులు వేయడం, కరెంట్ తీగలను అమర్చడం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
బాధిత కుటుంబాల్లో ఇద్దరికి ఉద్యోగం ఇచ్చాం..
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు, అటవీ శాఖ మార్గదర్శకాల గురించి పీసీసీఎఫ్ ఆర్. శోభ కమిటీ సభ్యులకు వివరించారు. కుమ్రం భీం- ఆసిపాభాద్ జిల్లాల్లో పులి దాడిలో మరణించిన రెండు భాదిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాం. బాధిత కుటుంబాల్లో ఇద్దరికి అటవీశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు.
సమావేశంలో కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, మాజీ శాసన సభ్యుడు జీ అరవింద్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ సిద్ధానంద్ కుక్రేటి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) సభ్యుడు మురళీ, డబ్లూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు అనిల్ కుమార్ ఏపుర్, ఫరీదా తంపాల్, పర్యావరణ నిపుణులు రాజీవ్ మాథ్యూ, ఇమ్రాన్ సిద్ధిఖీ, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.