Minister KTR | లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రస్తుతం ఉన్న 4లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి.. 8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బయో ఏషియా సదస్సు నేపథ్యంలో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ బయో ఏషియా ప్రాముఖ్యతతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను వివరించారు. ఇప్పటి వరకు 19 సదస్సులు జరిగాయని, ఈ సారి ప్రతిష్టాత్మకంగా 20వ సదస్సు నిర్వహించుకోబోతున్నామన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు సదస్సు కొనసాగుతుందని, ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్ : షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్కేర్’ అన్న ఇతివృత్తంతో 20వ బయో ఏషియా సదస్సు (bio asia) జరుగుతుందన్నారు. గత 19 సంవత్సరాల్లో 24వేలకోట్ల పెట్టుబడులను బయో ఏషియా రాష్ట్రానికి తీసుకువచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు కొన్ని ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏషియా విస్తృతమైన సేవలను అందించిందన్నారు.
దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20వేలకుపైగా భాగస్వామ్య చర్చలు , 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు. 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని తెలిపారు. గత 20 సంవత్సరాలలో 250కి పైగా అవగాహన ఒప్పందాలను, ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయన్నారు. ఈసారి కూడా పలు దేశాలు బయో ఏషియా(bio asia) తో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని తెలిపారు. బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఉందన్నారు. తొలిసారి ఆపిల్ కంపెనీ కూడా పాల్గొంటుందని కేటీఆర్ ప్రకటించారు.
లైఫె సైన్సెన్ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయోఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యమని, 2021లో హైదరాబాద్ దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లు ఉండగా.. 2028 నాటికి దీన్ని వంద బిలియన్ డాలర్లకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న 4లక్షల ఉద్యోగాలను 8లక్షలకు పెంచుతామన్నారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతుందన్నారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని, ఏటా రూ.900కోట్ల టీకాలు తయారు చేస్తుందని మంత్రి కేటీఆర్. త్వరలోనే ఈ సంఖ్య రూ.1400 కోట్లకు చేరుతుందని, టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని తెలిపిన కేటీఆర్ .. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా 214 ఉండడం, సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కు, త్వరలో ప్రారంభంకానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్ను జీవశాస్త్రరంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంల ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్లోనే ఏర్పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూండటం కూడా జీవశాస్త్ర రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫార్మా, లైఫ్ సెన్సెన్ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలకప్రాంతంగా ఆవిర్భవించిందని, పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్న హామీలను ఇచ్చుకుంటూ వెళ్తుందని, ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాల్లో డిఫెన్స్ కారిడార్లను, బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడంతో కేంద్రం దేశ అభివృద్ధిని పణంగా పెడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుకున్న బల్క్ డ్రగ్ పార్క్ను ఇవ్వకున్నా, హైదరాబాద్ ఫార్మాసిటీకి సహాయం చేయకున్నా, ఐటీఐఆర్ రద్దు చేసినా ఆయా రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.